ముదురుతున్న వివాదం: ఎఎస్పీ నవీన్ కోసం గాలింపు
అయితే నవీన్ కుమార్ ఇంట్లో లేరని, అర్బన్ ఎస్పీ పిలిస్తే వెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు. నవీన్ కుమార్ను కిడ్నాప్ చేసి ఉంటారని వారు చెబుతున్నారు. పోలీసులే ఆయనను తీసుకుని వెళ్లారని, దాంతో తాము ఆందోళన చెందుతున్నామని వారు అంటున్నారు. దీనిపై హెచ్ఆర్సీలో వారు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. నవీన్ కుమార్ కోసం పోలీసులు ఇంట్లో అణువణువూ గాలించారు. కానీ ఆచూకీ దొరకలేదు. నవీన్ కుమార్కు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు అంటన్నారు.
ఎస్పీ త్రివిక్రమ్ పైన సిబిఐ విచారణ జరిపించాలని రంపచోడవరం ఎఎస్పీ నవీన్ కుమార్ ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన రాజమండ్రిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కోట్లాది రూపాయల గంజాయి రాకెట్, తనపై జరిగిన హత్యాయత్నం సంఘటనలపై సిబిఐ దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గంజాయి రాకెట్లో జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మతో పాటు డిజి స్థాయి అధికారి ప్రమేయం కూడా ఉందని మరో బాంబు పేల్చారు. తన వద్ద పలు ఆధారాలు తీసుకున్న ఏలూరు రేంజ్ డిఐజి తాను అసలు ఆధారాలే ఇవ్వలేదని మీడియాకు చెప్పారన్నారు.
గంజాయి రాకెట్ ఆధారాలను బయటకు తీసినందుకే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఎస్పీపై తాను చేసిన ఆరోపణలను ఉన్నతాధికారులు క్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్నారే తప్ప కోట్లాది రూపాయల గంజాయి రాకెట్, ఇతర అక్రమాలను ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదో తనకు అర్థం కావట్లేదన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా ఏదైనా కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరగకపోతే అన్ని ఆధారాలతో హైకోర్టును ఆశ్రయిస్తానని నవీన్ స్పష్టం చేశారు.