విజయమ్మ దీక్ష ప్రారంభం: దురదృష్టవంతులం... పిల్లి
ఈ సందర్భంగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు మాట్లాడారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ అనేది కేవలం పథకం కాదని అది రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టి చరిత్ర సృష్టించారన్నారు. అందరికీ విద్య అందించాలన్న ఉద్దేశ్యంతో వైయస్ దీనిని ప్రవేశ పెట్టారని, ఇందుకు ఆయనకు అందరు రుణపడి ఉండాలన్నారు.
తాము చదువుకున్న రోజుల్లో వైయస్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా ఉన్నత చదువులు చదివే వాళ్లమని అభిప్రాయపడ్డారు. తాము కాస్త ముందు పుట్టడం తమ దురదృష్టమన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం వైయస్ ఆస్తులకే వారసుడని రాజకీయాలకు కాదంటున్న కాంగ్రెసు నేతలు వైయస్ పథకాలను ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రశ్నించారు. వైయస్ విజయమ్మ ఎందుకు దీక్ష చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలన్నారు.
కాంగ్రెసు పార్టీ విద్యార్థులను పదివేల లోపు ర్యాంకులు, ప్రభుత్వ పాఠశాలలు అంటూ మోసం చేస్తోందన్నారు. విద్యార్థులు తిరగబడితే ప్రభుత్వాలే కూలిన సందర్భాలు ఉన్నాయని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఫీజు రీయింబర్సుమెంట్సు పథకాన్ని పాతరేయాలని కాంగ్రెసు చూస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. భర్త పోయినా, కొడుకు జగన్ జైళ్లో ఉన్నా వైయస్ విజయమ్మ మన కోసం ఆందోళన చేస్తున్నారన్నారు.
దశలవారీగా రీయింబర్సుమెంట్సును ఎత్తి వేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఇది ప్రజలచే ఏర్పడిన ప్రభుత్వం కాదని, కేవలం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీచే ఏర్పడిన ప్రభుత్వమని, అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.