కొత్త కుంపటికి మద్దతు: పరోక్షంగా జగన్పై చిరంజీవి
కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు శనివారం హైదరాబాదులోని జూబ్లీహాల్లో ఏర్పాటు చేసిన మేధోమథన సదస్సులో ఆయన ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీలో సమనవ్యలోపం, స్తబ్ధత చోటు చేసుకున్నాయని, ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలుసునని ఆయన అన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేసింది కాంగ్రెసు పార్టీయేనని, తాను కాంగ్రెసులో ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు.
జయాపజయాలు కాంగ్రెసుకు కొత్త కాదని, కలిసికట్టుగా అందరూ పనిచేస్తే కాంగ్రెసు విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. తనకు పార్టీ ఏమిటని కాదు, తాను పార్టీకి ఏమిటనే ఉద్దేశంతోనే తాను ఈ సదస్సుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు పార్టీకి కీలకమైనవని ఆయన అన్నారు. ఇలాంటి మేధోమథన సదస్సులు ఇంకా జరగాలని, జిల్లాల్లో కూడా ఇటువంటి సదస్సులు జరగాలని ఆయన అన్నారు. నిర్ణయాల విషయంలో కాంగ్రెసు పార్టీ ఊగిసలాట ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీసీలకు 104 సీట్ల దాకా కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లాగా బీసీలకు కూడా సబ్ ప్లాన్ ప్రకటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణంపై కూడా ఆయన ప్రస్తావించారు. బొగ్గు కుంభకోణం విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు తాము సమాధానం ఇచ్చే స్థితిలోనే ఉన్నామని, అయితే బిజెపి మాదిరిగా మీడియాను కాంగ్రెసు సమర్థంగా వాడుకోలేకపోతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు ఇంట్లో ఉన్నాను, సునామీ వచ్చినా ఏమీ కాదని అనుకున్నానని, అయితే కంగ్రెసు గోడలకు బీటలు వారాయని, దీంతో తనలో అభ్రతా భావం చోటు చేసుకుందని, అయినా కలిసికట్టుగా అందరం పనిచేయాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి గడ్డు కాలమేనని, అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. ధర్మాన కమిటీ నివేదిక అమలులో స్పష్టత లేదని, నివేదికలు ఇస్తే సరిపోదని, వాటి అమలుపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. తాను అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని వి హనుమంతరావు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.