2జి స్కామ్: జెపిసి ముందుకు సుబ్బారావు
సుబ్బారావు 2007 ఏప్రిల్, 2008 సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. వివాదాస్పదమైన రేడియోవేల్ లైసెన్సుల కేటాయింపులు 2008 జనవరిలో జరిగాయి. నిజానికి జెపిసి సమావేశం ఈ నెల 14వ తేదీన జరగాల్సి ఉండింది. ఆ రోజు క్యాబినెట్ మాజీ కార్యదర్శి కెఎం చంద్రశేఖర్ జెపిసి ముందు హాజరు కావాల్సి ఉంది.
చంద్రశేఖర్ను ప్రశ్నించడానికి మరో తేదీని నిర్ణయించనున్నారు. 2007 జూన్ నుంచి 2011 జూన్ వరకు ఆయన ఉన్నతాధికారిగా పనిచేశారు. ఓ నెల తర్వాత జెపిసి సమావేశం సెప్టెంబర్ 18వ తేదీన జరుగుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని సాక్షులుగా పిలువాలని డిమాండ్ చేస్తూ బిజెపి సభ్యులు ఆగస్టు 22వ తేదీన జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. సమావేశాన్ని బహిష్కరించారు.
ఈ నెల 18వ తేదీన జరిగే సమావేశానికి బిజెపికి చెందిన ఆరుగురు సభ్యులు హాజరవుతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. మన్మోహన్ సింగ్ను, చిదంబరాన్ని ప్రశ్నించాలని తాము డిమాండ్ చేసినందుకు కాంగ్రెసు సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని బిజెపి సభ్యులు ఆరోపించారు. అయితే, బిజెపి ఆరోపణలను కాంగ్రెసు ఖండించింది.