ఏంచేద్దాం?: కిరణ్తో ఆజాద్, కోవర్ట్ లిస్ట్ ఇచ్చా..సుధాకర్
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఇలా సమస్యలు చుట్టుముట్టడంతో 2014 నాటికి పార్టీని బలోపేతం చేసే అంశంపై ప్రధానంగా వారిద్దరు చర్చించారు. ఆదివారం రాత్రి కిరణ్తో ఆజాద్ దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. ఒకవేళ లేఖ ఇస్తే సీమాంధ్రకు టిడిపికి చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
లేఖ ఇచ్చిన తర్వాత టిడిపిలో తలెత్తే అంతర్గత పరిణామాలు, కాంగ్రెసు పైన పడే ప్రభావం పైనా వారు చర్చించారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు, రిజర్వేషన్ల అంశం, నామినేటెడ్ పోస్టులు, జగన్ పార్టీ పరిస్థితి, ఇందిర బాట, ఎస్సీ ఎస్టీ ప్రణాళిక, రాబోయే శాసనసభ సమావేశాల గురించి ఆజాద్ కిరణ్తో మాట్లాడారు. అంతకుముందు మధ్యాహ్నం ధర్మాన ప్రసాద రావు ఆజాద్ను కలిసి తాను రాజీనామా చేసిన, తదనంతర పరిణామాలపై వివరించారు.
ఆజాద్ను పలువురు నేతలు కలుస్తున్నారు. వారందరితోనూ ఆజాద్ పార్టీ పరిస్థితి, ఎలా గట్టెక్కించాలనే అంశం పైనే ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. సోమవారం ఉదయం ఎంపీలు లగడపాటి రాజగోపాల్, వివేక్, యువజన కాంగ్రెసు నేత సుధాకర్ బాబు తదతరులు కలిశారు.
భేటీ అనంతరం సుధాకర్ బాబు మాట్లాడుతూ... పార్టీలోని కోవర్టుల గురించి ఆజాద్ అడిగారని, తాను సమాచారం ఇచ్చానని చెప్పారు. గాంధీ భవన్ అంటే తెలియని వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని, అలా జరగకుండా చూడాలని కోరినట్లు సుధాకర్ చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని తాను ఆజాద్కు విజ్ఞప్తి చేశానని తెలిపారు.