తెలంగాణ: ముందే క్లారిటీ, సీమాంధ్రకు బుజ్జగింపులు?
సెప్టెంబర్ రెండో వారంలో తెలంగాణపై తమ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుందని కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఆ దిశగా చంద్రబాబు పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాయలసీమ, ఆంధ్రా, తెలంగాణ ప్రాంత నేతలతో ఆయన ఈ అంశంపై చర్చిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతలు చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి. రాయలసీమ ప్రాంత నేతలు అయితే ఏకంగా బాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేసి షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాబు మొదట సీమాంధ్ర నేతలకు తన నిర్ణయాన్ని చెప్పి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణపై నిర్ణయం మన చేతుల్లో లేదని, తెలంగాణకు అనుకూలంగా లేఖ రాస్తే తెలంగాణ అంశం కాంగ్రెసు కోర్టులోకి వెళ్తుందని బాబు వారికి నచ్చజెప్పుతున్నారని అంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇరు ప్రాంతాలలో పార్టీ బలోపేతమవుతుందని, ఆ తర్వాత తెలంగాణ అంశం బాధ్యత మాత్రం కాంగ్రెసుదే అవుతుందని, మనం నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందని, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బంతి మన కోర్టులో లేకుండా జాగ్రత్త పడదామని సీమాంధ్ర నేతలకు బాబు చెబుతున్నారని అంటున్నారు.
తెలంగాణ అనుకూలంగా బాబు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని, లేఖ రాసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే సీమాంధ్ర నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నందు వల్ల వారికి నచ్చజెప్పేందుకే ఆలస్యమవుతుందనే వారు ఉన్నారు. రాష్ట్ర పర్యటన ప్రారంభమయ్యేలోగా సీమాంధ్ర నేతలకు నచ్చజెప్పి కేంద్రానికి లేఖ రాయాలనే భావనంతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.