సత్యసాయి మృతిపై పిల్: స్వీకరించిన హైకోర్టు, వాయిదా
కాగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మృతిపై, ఆయనకు చెందిన ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన సత్యసాయి భక్తుడు రమేష్ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, దేవాదాయశాఖ కార్యదర్శిని, డిజిపిని, సిబిఐని, సత్యసాయి సెంట్రల్ ట్రస్టును ప్రతివాదులుగా చేర్చారు. సత్యసాయి మృతి వెనుక కారణాలు నిగ్గు తేల్చడంతో పాటు, ఆస్తులపై ఆరోపణలు నిగ్గు తేల్చాలని కోరారు. సత్యసాయి ఆస్తులను ప్రజాశ్రేయస్సుకే వినియోగించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్టును రద్దు చేసి తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డు తరహాలో ఒక స్వయం ప్రతిపత్తి గల బోర్టు ఏర్పాటు చేసి దానికి ట్రస్టు బాధ్యతలు అప్పగించాలని పిటిషన్లో కోరారు. దీని కోసం దేవాదాయ చట్టానికి సవరణ చేయాలని సూచించారు. శ్రీ సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్టు ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని.. సత్యసాయి మరణానంతరం ట్రస్టు పర్యవేక్షణలో భారీ మొత్తాలను ప్రశాంతి నిలయం నుంచి బయటకు తీసుకెళ్లిన ఉదంతాలపై విచారణ జరిపించాలని కోరారు.
అంతవరకూ ట్రస్టును హైకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఇందుకోసం ఓ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ట్రస్టు బాధ్యతలు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ వివరాల ప్రకారం సత్యసాయి ఆస్తులు 40వేల కోట్లకు పైగా ఉన్నాయని పిటిషన్లో తెలిపారు. ఇందులో యూనివర్సిటీ సముదాయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హిల్వ్యూ స్టేడియం, ఎయిర్పోర్టు, ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం, జనరల్ హాస్పిటల్, మ్యూజియం, ప్లానిటోరియం, మ్యూజిక్ కాలేజీ కాంప్లెక్స్, వైట్ఫీల్డ్ ఉన్నాయని.. వీటితో పాటు 180 దేశాల్లో 1200 కేంద్రాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆరోగ్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సత్యసాయి బాబాకు అత్యంత నమ్మకస్తుడైన సత్యజిత్ ఇటీవల బాబా వీలునామాను మీడియాలో ప్రకటించారని.. ఈ ఆస్తులకు బాబా కేవలం ట్రస్టీయేనని, భక్తులు ఇచ్చిన విరాళాలు ప్రజా సంక్షేమం కోసమే వినియోగించాలని వీలునామాలో ఉందని.. ఈ వీలునామాపై బాబా స్వయంగా సంతకం చేసారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల సత్యసాయి బాబా వీలునామా రాశారని సత్యజిత్ తెలిపిన విషయం తెలిసిందే.