బాబు చెప్పాల్సిందే: పద్మ, అదేం లేదు: ఎర్రన్నాయుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీలో చంద్రబాబును కాంగ్రెస్ ఎంపీలు కలిసింది వాస్తవం కాదా అని పద్మ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఎదిరించాలంటే కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకోలేదా అని ఆమె అన్నారు. మీడియాను అడ్డంపెట్టుకుని కుళ్లురాజకీయాలు చేసేది తెలుగుదేశం పార్టీ నేతలేనని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు.
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వాయిస్ను అధికారికంగా పీటీఐ వార్తా సంస్థ విడుదల చేయలేదని ఆమె అన్నారు. కాని పీటీఐ పేరుతో టీడీపీ, మీడియా సంస్థల ప్రచార నాటకాన్ని పీటీఐ అధికారులు దృష్టికి తీసుకెళతామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్కు కార్పొరేట్ సంస్థల నిధులపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ అధికార పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కోరారు.
ప్రధాని మన్మోహన్ సింగ్తో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె. ఎర్రన్నాయుడు అన్నారు. సాక్షి పత్రిక రాసిన వార్తలు అవాస్తవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు ప్రధానితో రహస్య చర్చలు జరపారనే వార్తలను సాక్షి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరూపించలేకపోతే సాక్షి పత్రికను, చానెల్ను మూసేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.