క్షీర విప్లవకారుడు కురియన్ కన్నుమూత
భారతదేశాన్ని పాడి పరిశ్రమ ఉత్పత్తుల లోటు నుంచి పాలవెల్లువకు దారితీసేలా తనదైన వినూత్న ఆలోచనను కురియన్ అమలుచేశారు. ఆయన కృషి ఫలితంగానే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పాల ఉత్పత్తిని చేసే దేశంగా ఎదిగింది. అంతేగాక, ఆయన ఆధ్వర్యంలో ఎదిగిన ‘అమూల్' ఒకప్పుడు భారతదేశమంతా ప్రతి ఇంటిలో విస్తృతంగా వినియోగించబడింది.
సహకార సంఘాల ద్వారా భారత రైతాంగాన్ని పరిపుష్టం చేసిన ఘనత కురియన్దే. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్టప్రతి ప్రణబ్ ‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పాడిపరిశ్రమ అభివృద్ధికి విశేషంగా దోహదం చేసిన వ్యక్తి' అని కొనియాడారు. భారత సహకార ఉద్యమ పితామహులలో ఒకరుగా కురియన్ను ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఆయన సృష్టించిన క్షీర విప్లవం పాల ఉత్పత్తిలో భారత్ను నిరుపమాన దేశంగా మార్చిందని మన్మోహన్ అన్నారు.
భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్తో గౌరవించింది. రామన్ మేఘసేసే అవార్డు కూడా ఆయనను వరించింది. ఆయన 1921 నవంబర్ 26వ తేదీన కేరళలోని కోజికోడ్లో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో సైన్స్లో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపకారవేతనంతో డైరీ ఇంజనీరింగ్ చేశారు. బెంగళూర్లోని పశు సంవర్ధన, పాడి పారిశ్రమ సంస్థలో శిక్షణ తీసుకున్నారు. మిషిగాన్ విశ్వవిద్యాలయంలో 1948లో మెకానికల్ ఇంజనీరింగులో మాస్టర్స్ డిగ్రీ చేశారు. డైరీ ఇంజనీరింగ్ ప్రత్యేకాంశంగా ఈ మాస్టర్స్ డిగ్రీ చేశారు.