పార్టీ వారే ప్రణబ్ కొడుకుని కాలర్ పట్టుకొని కుమ్మేశారు
గత గురువారం అభిజిత్ త్రిపుర రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసి కమిటీ ప్రధాన కార్యదర్శి సుబాల్ భౌమిక్ సోమవారం అగర్తాలలో తెలిపారు. దాడి జరిగిన సమయంలో తానూ పక్కనే ఉన్నానని చెప్పారు. అభిజిత్ అగర్తాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బముతియాలోని కాళీ బజార్లో త్రిపుర తొలి సిఎం సచీంద్రలాల్ సిన్హా పేరుతో నెలకొల్పిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమైన అభిజిత్ వద్దకు టిపిసిసి మరో ప్రధాన కార్యదర్శి బలై గోస్వామి సమీపంలోనే ఉన్న పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలని ఆయనను కోరారు. కార్యాలయానికి చేరుకున్న అభిజిత్ కారు దిగుతుండగానే కొందరు కాంగ్రెసు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకొని కిందకి లాగి కార్యాలయం లోపలికి లాక్కొని వెళ్లారు. అక్కడ అతనిపై చేయి చేసుకున్నారని భౌమిక్ తెలిపారు.
దాడికి తానే ప్రత్యక్ష సాక్షిని, తాను ఒక్కడినే అయినందున వారిని అడ్డుకోలేక పోయానని తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు సుదివ్ రాయ్ బర్మస్కు చెప్పకుండా త్రిపురకు ఎందుకొచ్చారని అభిజిత్ను కాంగ్రెసు కార్యకర్తలు నిలదీశారని చెప్పారు. ఈ దాడి ఘటనను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ నెల 7వ తేదిన వివరించానని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.