ధర్మానకు ఎదురుదెబ్బ: 25న హాజరుకు కోర్టు సమన్లు
ఐఎఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శామ్యూల్లపై ఐపిసి అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 25వ తేదీన తమ ముందు హాజరు కావాలని వీరికి కోర్టు సమన్లు జారీ చేసింది. వైయస్ జగన్, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలకు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడగించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావును సిబిఐ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
సిబిఐ ఛార్జిషీటులో పొందుపర్చిన అభియోగాలు, ఆరోపణలను తప్పుపట్టబోమని, న్యాయకోవిదులు తాను తప్పు చేయలేదని చేప్పేదాక వెనక్కితగ్గేది లేదని మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో స్పష్టం చేసారు. తప్పుచేసినవాడు రాజకీయాల్లో తప్పించుకోలేడని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన 33 రోజుల అనంతరం ఆయన శ్రీకాకుళం వెళ్లి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
అభియోగాలు వచ్చినంత మాత్రాన నేరం రుజువు అయినట్టు కాదని, సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేస్తే అరెస్టు చేయాలనేం లేదనే విధివిధానాలు విపక్షాలకు తెలిసినప్పటికీ, తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకూ సమంజషమో వారి విచక్షణకే వదిలేశానన్నారు. కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ రూపొందించుకునేందుకే విపక్షాలు తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ సహనంతో మౌనం వహిస్తున్నానన్నారు.