మేం తెలంగాణకు వ్యతిరేకం, జగన్ మిత్రుడే: అసదుద్దీన్
బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో మజ్లిస్ వైఖరి ఎప్పటికీ మారబోదన్నారు. గతంలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికకే ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఎంఐఎంకు పొత్తేమీ లేదని చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు మంచి మిత్రుడని, అందుకే జైలుకు వెళ్లి పరామర్శించానని, ఇందులో రాజకీయాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో లౌకిక అభ్యర్థి అయిన ప్రణబ్కు ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కృతజ్ఞతలు తెలిపేందుకు మరోమారు జగన్ను కలుస్తానని తెలిపారు.
మజ్లీస్ పార్టీ హైదరాబాద్లో బలంగా ఉంది. హైదరాబాద్ పార్లమెంటు సీటును ఆ పార్టీయే గెలుచుకుంటూ వస్తోంది. అలాగే, కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి తగిన బలం ఉంది. కడప, కర్నూలు జిల్లాలతో కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆ జిల్లాల్లోని బలంతో ముందుకు సాగవచ్చునని మజ్లీస్ భావిస్తోంది.