డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై పరిమితి
డీజిల్ ధరను లీటరుకు 5 రూపాయలు పెంచారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింది కిరోసిన్, పెట్రోల్ ధరలను మార్చలేదు. సబ్సిడీ కింద సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఆరు మాత్రమే ఇస్తారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ కంపెనీలకు ప్రతి రోజు రూ. 550 కోట్ల నష్టం వాటిల్లుతోంది. డీజిల్ అమ్మకంపై లీటరుకు 19 రూపాయల నష్టం వస్తుండగా, కిరోసిన్పై లీటరుకు రూ.32.7, సిలిండర్కు రూ.347 రూపాయల చొప్పున ప్రతి రోజూ నష్టం వస్తోంది.
కాగా, డీజిల్ ధర పెంపుపై ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా మిత్రపక్షాలు కూడా భగ్గుమన్నాయి. సామాన్యుడిపై మోయలేని భారం పడుతుందని అన్నాయి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. డీజిల్ ధర పెంపును యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు తీవ్రంగా వ్యతిరేకించింది. తాము డీజిల్ ధర పెంపును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు.
డీజిల్ ధర పెంపును క్రూరమైన జోక్గా బిజెపి అభివర్ణించింది. సామాన్యుడిపై ఇది చావు దెబ్బ అని వ్యాఖ్యానించింది. పెట్రోల్ మాఫియాతో ప్రభుత్వం కుమ్మక్కయిందని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. డీజిల్ ధర పెంపును ప్రజా వ్యతిరేక చర్యగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు.