గ్యాస్ సిలిండర్తో ర్యాలీలో టిడిపి అధినేత బాబు
కేంద్రం ప్రభుత్వం పెంచిన ఎల్పీజీ, డీజిల్, ఎల్పీజీ పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జూబ్లీ చెక్పోస్టు వరకు ర్యాలీ నిర్వహించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్పై ఆంక్షలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వంట గ్యాస్ పెంపువల్ల సామాన్యులను ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు.
పెంచిన ధరలను తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించన పక్షంలో టీడీపీ ప్రతి ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టి ఉద్యమం చేపడతామని ఆయన అన్నారు. ఏడాదికి ఆరు సిలిండర్లు ఒక కుటుంబానికి సరిపోవని ఆయన అన్నారు. ఒక్కో సిలిండర్పై రూ. 350 అదనపు భారం పడుతుందని, పరిశ్రమలపై రూ. 700 కోట్లు, ఆర్టీసీపై 400 కోట్లు అదనపు భారం పడుతుందని ఆయన అన్నారు. చమురు కంపెనీలకు లాభాలు వచ్చినా నష్టాలు చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
కాగా, డీజిల్ ధర పెంపునకు, వంటగ్యాస్ సిలిండర్లపై ఆంక్షలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనకు వామపక్షాలు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా సిపిఐ, సిపిఎం నాయకులు ఎబి బర్దన్, ప్రకాష్ కారత్ చంద్రబాబును ఢిల్లీకి అహ్వానించాయి. కొద్ది రోజుల్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. డీజిల్ ధర పెంపునకు నిరసనగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చంద్రబాబు చెప్పారు.