కోల్గేట్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ
కోల్ బ్లాక్స్ కేటాయింపులో కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియను ఎందుకు అనుసరించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా కోల్ బ్లాక్స్ కేటాయింపులకు అనుసరించిన మార్గదర్శకత్వాలు ఏమిటి, అందులో ఏమైనా తేడాలు వచ్చాయని అని కూడా అడిగింది. అక్రమ కేటాయింపులు పొందినవారిలో రాజకీయ నాయకులు, వారి బంధువులు ఉన్నారని ఎక్కువగా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయని కూడా ప్రశ్నించింది. ప్రైవేట్ పార్టీలకు మేలు చేయడానికి మార్గదర్శక సూత్రాలను విస్మరించారా అని ప్రశ్నించింది. ప్రస్తుత కేటాయింపుల పద్ధతి ద్వారా కోల్ బ్లాక్ మైన్స్ కేటాయింపులు జరిపి ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకుందా, కాగ్ తప్పు పట్టిందేమిటని సుప్రీంకోర్టు అడిగింది.
తమ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎనిమిది వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బొగ్గు శాఖ కార్యదర్శిని ఆదేశించింది. పిటిషన్లో తీవ్రమైన ప్రశ్నలు వేశారని, వాటికి కేంద్రం సమాధానం చెప్పాల్సే ఉంటుందని వ్యాఖ్యానించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చేసిన సాధన భిన్నమైందని అభిప్రాయపడింది. దాని సాధనలో తాము జోక్యం చేసుకోదలుచుకోలేదని, పిటిషన్ లేవనెత్తిన అంశాలు అందుకు భిన్నమైనవని అభిప్రాయపడింది.
కాగ్ రాజ్యాంగబద్దమైన సంస్థ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేంద్రం సమాధానం చెప్పాల్సిన విషయాలు పిటిషన్లో ఉన్నాయని చెప్పింది. నాలుగు కోల్ బ్లాక్స్ కాంట్రాక్టులను రద్దు చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నోటీసులతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లే.