పైరవీలతోనే నంది అవార్డులు: మోహన్ బాబు వ్యాఖ్య
నంది అవార్డుల వెనుక రాజకీయాలు దాగి ఉన్నాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత హిందీ రచయిత మునిసుందరం రచించిన 'ఒక యుద్ధం తరువాత' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోహన్బాబు సినీ నంది అవార్డుల ఎంపిక తీరుపై విరుచుకుపడ్డారు.
రాజకీయాల వల్లే తనకూ నంది అవార్డు లభించలేదన్నారు. నంది అవార్డులు వెనుక రాజకీయం ఉన్నందున ప్రతిభకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు. నంది అవార్డులు రావాలంటే వెనక వేరే కారణాలు ఉండాలని ఆయన అన్నారు.
ఎస్.మునిసుందరం తాను రాసిన ఒక యుద్ధం తరువాత గ్రంథాన్ని తనకు అంకితం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నంది అవార్డుల గురించి ప్రస్తావన రావడంతో మోహన్బాబు ఆసంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా నంది అవార్డులను ప్రదానం చేస్తుంది.