కెసిఆర్ నుండి వసంతకు రూ.10 లక్షలు: జయప్రకాశ్
కెసిఆర్తో 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయిన వసంత నాగేశ్వర రావు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కండువ మెడలో కప్పుకున్నారన్నారు. తెరాస కండువ కప్పుకున్న వసంతను సమైక్యాంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని మండిపడ్డారు. సమైక్యాంధ్ర నేతలను విమర్శించడం ఆయనకు సరికాదన్నారు.
కాగా అంతకుముందు రోజు ప్రాంతీయ విద్వేషవాదులతో వసంత కుమ్మక్కయ్యారని, చరిత్ర తెలుసుకోకపోతే అతను చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని అడుసుమిల్లి మండిపడ్డారు. మొట్టమొదట్లో ఆంధ్రులకు గుర్తింపు తేవడానికి 1913 మే 26న బాపట్లలో న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర మహాసభ ఏర్పాటయిందని చెప్పారు. ఈ సభలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేశారని, ఆ తర్వాత పలుమార్లు సభలు జరిగాయన్నారు.
తెలంగాణలో మొదటి ఆంధ్ర మహాసభలు 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో సురవరం ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించారన్నారు. ఆ తర్వాత తెలంగాణలోను పలు సభలు జరిగాయన్నారు. చరిత్ర తిరగరాస్తే తెలుగువారంతా కలిసి ఉండాలన్న ఉద్యమం వంద ఏళ్ల క్రితం ప్రారంభమైందన్నారు.