కావూరి, టిఎస్సార్ ఇళ్లపై తెలంగాణ లాయర్ల దాడి
హైదరాబాదులోని బంజారాహిల్స్లో ఉన్న కావూరి ఇంట్లోకి న్యాయవాదులు దూసుకొచ్చారు. ఇంటిముందు ఉన్న పూలకుండీలను ఎత్తిపారేసి, అక్కడ తెలంగాణ జెండాను పాతారు. అక్కడి నుంచి సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్లారు. గేటు ఎదుట తెలంగాణ జెండాను పాతారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న అలాంటివారి ఆస్తులే తమ లక్ష్యమని, అలాంటి వారిని ఇక్కడ ఉండనివ్వబోమని జేఏసీ నాయకులు ఆ తర్వాత అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కావూరి ఇంటికి చేరుకుని జెండాను తొలగించేశారు.
సుబ్బిరామిరెడ్డి ఇంటికి వారు చేరుకునేలోపు న్యాయవాదులు పారిపోయారు. కావూరి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు న్యాయవాదులపై 147, 427, 447, 353, 504 రెడ్విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు.. కేబీఆర్ పార్కు వద్ద ఉన్న కాసు విగ్రహం వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు వ్యక్తులు టైర్లు వేసి నిప్పుపెట్టారు. అనంతరం అక్కడున్న శిలా ఫలకాలను ధ్వంసం చేసి పారిపోయారు.
సోమవారం ఉదయం వాకింగ్కు వచ్చినవారు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహానికి బట్ట కప్పేశారు. సంఘటన స్థలంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ముద్రించిన కరపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు సీమాంధ్రులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆ కరపత్రంలో ఉంది.
కరపత్రంపై టియుఎఫ్ చైర్మన్ కేశవరావు జాదవ్, కో చైర్పర్సన్ విమలక్క పేర్లు ముద్రించి ఉన్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఓబుల్రెడ్డి విద్యాసంస్థలకు చెందిన ఓ బస్సుకు ఆందోళన కారులు నిప్పుపెట్టగా, అందులోని రెండు సీట్లు కాలిపోయాయి. ఈ సంఘటనకు బాధ్యులెవరన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.