తిరుమల: ఇవో, చైర్మన్ మధ్య కంకణధారణ కలహం
సాధారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమానికి ముందుగా శ్రీవారి బంగారు వాకిలి వద్ద టిటిడి ఈవో కంకరణధారణ చేస్తారు. అప్పటి నుంచి ఆయనే ఉత్సవాలను దగ్గరుండి నడిపిస్తారు. ఈ కంకణధారణ చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు తిరుమల పొలిమేరలు దాటి వెళ్లకూడదనే నిబంధన ఉంది. ఈ ఆచారం అనాదిగా వస్తోంది.
అయితే, టిటిడి ఛైర్మన్లు కంకణ ధారణ చేసినా గతంలో కొందరు ఇవోలు పట్టించుకోలేదు. మరికొందరు ఈ ఆచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, టిటిడి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రం గత యేడాది అప్పటి టిటిడి ఈవోను ఒప్పించి తాను కూడా కంకణధారణ చేసుకున్నారు.
ఈ యేడాది కూడా ఈయనే ఛైర్మన్గా నియమితులు కావడంతో మళ్లీ కంకణధారణ చేయించుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ విషయం తెలిసిన ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సమ్మతించ లేదు. అయితే, రాజకీయ పలుకుబడిన కలిగిన కనుమూరి ఈవోను పక్కనబెట్టి కంకణధారణ చేయించుకున్నారు. ఇది ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీయడంతో ఈ కార్యక్రమానికి ఈవో దూరంగా ఉన్నారు.
ఈ విషయం చివరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన పంచాయతీతో ఈవో శాంతించి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుంటున్నట్టు సమాచారం.