పైరవీలతో కాదన్న సురవరం: తెలంగాణపై కెసిఆర్ భేటీ
అయితే, తెలంగాణపై తాను కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో జరుపుతున్న చర్చల వివరాలను కెసిఆర్ సుధాకర్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది. పైరవీల ద్వారా తెలంగాణ రాదని, చర్చలకు ఉద్యమాలే నేపథ్యంగా ఉండాలని సురవరం సుధాకర్ రెడ్డి కెసిఆర్తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన కేంద్రానికి సూచించారు.
తెలంగాణ ఇచ్చి తీరాలని ఆయన అన్నారు. అది రాజకీయంగా జరగాల్సిన ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఉద్యమాలు చేపడుతూ జరిపే సంప్రదింపుల ద్వారా తెలంగాణ వస్తుందని తాము నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. పోరాటాలు చేస్తూ చర్చలు జరపాలనేది తమ ఉద్దేశమని ఆయన అన్నారు.
కేంద్రంతో చర్చలు జరుగుతున్నట్లు కెసిఆర్ తనతో చెప్పారని, చర్చలు సానుకూలంగా ఉన్నాయని కూడా చెప్పారని ఆయన అన్నారు. చర్చల ద్వారా తెలంగాణ వస్తే మంచిదేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సిపిఐ ప్రత్యక్ష పోరాటంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇటీవల సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. నారాయణ తెలంగాణ పోరు యాత్ర నిర్వహించారు.
కాగా, తెలంగాణ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇతర పార్టీలే కలిసి రావడం లేదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. పేదలకు మేలు చేసేది కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ఆమె అన్నారు.