మధ్యంతర ఎన్నికలకు ఎవరు రెడీ, ఎవరు కాదు?
అయితే, యుపిఎ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండబోదని, 2014 లోపల ఏమైనా జరగవచ్చునని బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ అన్నారు. ఈ స్థితిలో మధ్యంతర ఎన్నికలకు ఏ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి, ఏ పార్టీలు సిద్ధంగా లేవనేది ఆసక్తికరంగా మారింది. మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇష్టంలేని పార్టీల మద్దతు యుపిఎకు లభించే అవకాశాలున్నాయి.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు లోకసభ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఉంది. ఒక రకంగా దానికోసమే మమతా బెనర్జీ యుపిఎకు మద్దతు ఉపసంహరించుకున్నారనే అభిప్రాయం ఉంది. శానససభలో తిరుగులేని మెజారిటీని సాధించిన మమత తమపై వ్యతిరేకత ఏర్పడక ముందే లోకసభ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆశిస్తోంది. వామపక్షాలు మాత్రం అంత సముఖంగా లేవు. రెండేళ్ల తర్వాత 2014లో లోకసభ ఎన్నికలు వస్తే ప్రభుత్వ వ్యతిరేకత తమ పార్టీ ఫలితాలపై ప్రభావం చూపించవచ్చునని మమతా బెనర్జీ భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉంది. శానససభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ములాయం సింగ్ నాయకత్వంలోని ఎస్పీ లోకసభ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా ఎదుర్కోవాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఎస్పీకి 22 మంది లోకసభ సభ్యులున్నారు. ఇప్పుడు లోకసభకు ఎన్నికలు వస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుందని ఎస్పీ భావిస్తోంది. అయితే, శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బిఎస్పీ అధినేత మాయావతి లోకసభ ఎన్నికలకు సిద్ధంగా లేరు. ప్రస్తుతం లోకసభలో ఎస్పీ సభ్యులు 21 మంది ఉన్నారు. దీంతో యుపిఎకు మమతా బెనర్జీ స్థానంలో మాయావతి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.
తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడియంకె లోకసభకు త్వరితగతి ఎన్నికలను కోరుకుంటోంది. కానీ, డిఎంకె మాత్రం అందుకు సిద్ధంగా లేదు. దీంతో డిఎంకె యుపిఎకు మద్దతును ఉపసంహరించుకునే అవకాశాలు లేవు. పైగా, తమ పార్లమెంటు సభ్యులు కుంభకోణాల్లో ఇరుక్కోవడం కూడా ఆ పార్టీకి సమస్యగా మారిందని, దాంతో కూడా యుపిఎకు మద్దతు ఉపసంహరించుకునే స్థితిలో లేదని అంటున్నారు.
పంజాబ్లో శానససభ ఎన్నికల్లో విజయం సాదించిన అకాలీదళ్ లోకసభ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆశిస్తోంది. బీహార్లో గత ఏడేళ్లుగా నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు. ఆయన లోకసభకు మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి వెనకాడే ప్రసక్తి లేదు. ఇప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జెడి పునరుజ్జీవం పోసుకుని బీహార్లో నితీష్ కుమార్ను ఎదుర్కునే స్థితిలో లేదు. దాంతో లాలూ ప్రసాద్ యాదవ్ యుపిఎకు మద్దతును ఉపసంహరించుకునే పరిస్థితి లేదు.
ఇక, ఆంధ్రప్రదేశ్లో లోకసభకు మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా మధ్యంతరానికి వెనకాడే స్థితిలో లేదు. కానీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మధ్యంతరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. అయినా, చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం యుపిఎకు మద్దతిచ్చే అవకాశాలు లేవు. కానీ, ములాయం సింగ్, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగించవచ్చు.