కొండా లక్ష్మణ్ బాపూజీ కన్నుమూత
నలభై ఏళ్లకు పైగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాపూజీ భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1969లో తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి బాపూజీ. ఆ తర్వాత తెలంగాణ సాధన సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించారు.
ఆయన వయస్సు 96. మరో వారం రోజుల్లో ఆయన పుట్టిన రోజు రానున్న సమయంలో ఆయన కన్నుమూశారు. తెలంగాణ సాయుధ పోరాటం, 2009 నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన జైలు జీవితం కూడా గడిపారు. రెండు రోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడుకి ఆయనే స్వయంగా ఓ వస్త్రాన్ని సమర్పించారు. దీనిని నల్గొండ జిల్లాలో తయారు చేయించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెసు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, గాదె వెంకట్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జెఏసి చైర్మన్ కోదండరామ్, బిజెపి కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు అని కెసిఆర్ అన్నారు.