ప్రభుత్వ లాంఛనాలతో: కిరణ్, తెలంగాణ సాధిస్తేనే.. జానా
బాపూజీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తున్నట్లు బిసి సంక్షేమ మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణతో బాపూజీ ఆత్మశాంతిస్తుందన్నారు. ఆయన ఆకాంక్ష నెరవేరడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బపూజీ మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని సారయ్య పేర్కొన్నారు. బడుగుబలహీన వర్గాల వారికి బాపూజీ ఎంతో అండగా నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తీరుతామని మంత్రి బసవరాజు సారయ్య స్పష్టం చేశారు.
కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడితే తమ పార్టీ తరఫున ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఢిల్లీలో అన్నారు. తమ పార్టీలోని అన్ని ప్రాంతాల వారిని సంప్రదించి ఓ అభిప్రాయానికి వస్తామని ఆయన తెలిపారు. బాపూజీ ఆశయం కోసం కృషి చేస్తామని అన్నారు.
బాపూజీ మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో అన్నారు. హైదరాబాదులో ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుతవాన్ని కోరారు. బాపూజీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. పోలీసు గౌరవ వందనంతో బాపూజీ అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.