తెలంగాణ కోసం విప్ల లేఖ: సంతకం చేయని జగ్గారెడ్డి
కాగా శుక్రవారం నాలుగోరోజు సభ ప్రారంభమైన కాసేపటికే 10.15కు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు సభలో తీర్మానం ప్రవేశ పెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్ సమస్యలపై చర్చిద్దామని స్పీకర్ సభ్యులకు సూచించారు. సమావేశాలకు సహకరించాలని అధికార పార్టీ సూచించిది.
తీర్మానం ప్రవేశపెడితే సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వారు ఎంతకూ పట్టు వీడలేదు. దీంతో స్పీకర్ సభను రెండోసారి గంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు స్పీకర్ నాదెండ్ల మనోహర్తో మంత్రులు శ్రీధర్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి భేటీ అయ్యారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన చాంబరులో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
కాగా సమావేశాలను తెరాస అడ్డుకుంటే ఆ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేసే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని తెలుస్తోంది. సభకు ఈరోజు, శనివారం మాత్రమే మిగిలి ఉంది. ఇంత వరకు పట్టుమని పది నిమిషాలు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ఈ రెండు రోజులైనా చర్చ జరిపేందుకు తెరాస ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే విషయమై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.