అరకోటికి యాదగిరి బేరం: ఆశతో మహిళ బోల్తా
విచారణలో తేలిన విషయాల ప్రకారం - డబ్బులో నొక్కేసేందుకు యాదగిరి చేసిన ప్రయత్నం ఒకటి బెడిసి కొట్టినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్కు చెందిన వై.విజయలక్ష్మి అనే మహిళ ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకొంది. రామంతపూర్ వాసి, ఆమె కుటుంబానికి మిత్రుడైన జహంగీర్ అనే వ్యక్తికి తన మనసులో మాట చెప్పారు. అతనికి రౌడీషీటర్ యాదగిరిరావుతో పాత పరిచయాలున్నాయి. విజయలక్ష్మి ఆసక్తి గురించి ఆయన చెవినవేశాడు. ఆమె వద్ద డబ్బు జాస్తిగా ఉన్నట్టు పసిగట్టిన యాదగిరిరావు జహంగీర్ ద్వారా ఆమెనోసారి తన ఇంటికి పిలిచాడు. తాను డీజీపీ అని, పేరు గిరీష్కుమార్ అని విజయలక్ష్మిని నమ్మించాడు. తాను ఎమ్మెల్యే టికెట్లయితే ఇప్పించగలనంటూ చెప్పాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మెంబర్గా పదవి ఇప్పిస్తానని, అందుకు రూ.50 లక్షలు ఇవ్వాల్సి ఉం టుందని చెప్పాడు. దాంతో ఆమె మూడు విడతలుగా రూ.39 లక్షలు చెల్లించింది. ఎందుకో అనుమానం వచ్చింది. ఆ డబ్బు ఇవ్వకుండా కొంతకాలం జాప్యం చేసింది. సరిగ్గా ఆ సమయం(మే నెల)లోనే గాలి బెయిల్ స్కాం బయటకు రావడంతో కంగు తింది. తనకే పదవి వద్దని, తానిచ్చిన రూ.39 లక్షలు వెనక్కి ఇచ్చేయాలని జహంగీర్ ద్వారా యాదగిరిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో రూ.2 లక్షలు తిరిగి ఇచ్చేశాడు.
మిగిలిన 37 లక్షలు ఇస్తావా? లేక విషయం నలుగురికీ చెప్పమంటావా? అంటూ బెదిరింపు ధోరణితో హెచ్చరించడంతో ఎట్టకేలకు దారికొచ్చాడు. మే 12న విజయలక్ష్మికి రూ.37 లక్షలు తిప్పి పంపేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు విజయలక్ష్మి వెల్లడించింది. యాదగిరికి చేరిన బెయిల్ స్కాం డబ్బంతా ఏమైందా? అని ఏసీబీ ఆరా తీస్తుండగా విజయలక్ష్మి ఉదంతం బయటకు వచ్చింది.