కంటతడి పెట్టిన గాలి: సోమశేఖర, పట్టాభిలకు బెయిల్
కాగా, బెయిల్ డీల్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని ఎసిబి మంగళవారం కోర్టు ముందు హాజరు పరిచింది. బెంగళూర్ జైలులో ఉన్న గాలిని హైదరాబాదుకు తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను హైదరాబాదులోని చంచల్గుడా జైలు నుంచి మంగళవారం ఉదయం అధికారులు కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తన సోదరుడు సోమశేఖర రెడ్డిని, కంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబును చూసి గాలి జనార్దన్ రెడ్డి చలించిపోయారు. దాంతో కంట తడి పెట్టారు. ఇదిలావుంటే, గాలి జనార్దన్ రెడ్డి కేసులో నిందితుడు యాదగిరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తండ్రి అనారోగ్య కారణంగా మానవతా దృక్పథంతో కోర్టు ఆయన బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మార్ కేసులో నిందితుడు, ఎమ్మార్-ఎంజీఎఫ్ ఆర్థిక విభాగం (దక్షిణ) అధిపతి గంగరాజు విజయరాఘవ (ఏ9)కు షరతులతో బెయిల్ సోమవారం మంజూరైంది. జనవరి 28న అరెస్టయిన ఆయన బెయిలు కోసం ఇదివరకు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 15న సీబీఐ అధికారులు అభియోగపత్రం దాఖలు చేయడంతో ఐదోసారి ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.
దీనిపై వాదనల అనంతరం సోమవారం షరతులతో బెయిల్ ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి దుర్గాప్రసాదరావు తీర్పు ఇచ్చారు. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని, పాస్పోర్టు ఉంటే స్వాధీనం చేయాలని, లేనట్లయితే ఆ మేరకు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయరాదని, నిత్యం సుల్తాన్ బజార్లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు.
శ్రీలక్ష్మికి అస్వస్థత
ఇదిలావుంటే, గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉంటున్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు మంగళవారం ఉదయం తరలించారు.