యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ఫ్యామిలీపై కేసు
ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులు (భార్య, కుమారులు, కుమార్తె) ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ చేయాలంటూ యలమంచిలికి చెందిన ఆడారి ఆదిమూర్తి ఈనెల 11న విశాఖపట్నం ఎసిబి న్యాయస్థానంలో కేసు వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జివి కృష్ణయ్య అక్టోబర్ 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఎసిబి డీఎస్పీని ఆదేశించారు.
ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎసిబి అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. కాగా, తన దగ్గర పని చేస్తున్న ఇద్దరు ఎస్సీ మహిళల పేరిట బ్యాంకుల నుంచి బస్సుల కొనుగోలుకు రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు కోటి రూపాయల విలువైన రాయితీని పొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
దర్యాప్తులో ఆరోపణలన్నీ వాస్తవమని తేల్చి రూ.98 లక్షలను ఎమ్మెల్యే నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ సూచించింది. అయితే, ప్రభుత్వం రికవరీ చేయకపోవడంపై యలమంచిలికి చెందిన కొయిలాడ వెంకటరావు ఇదే నెలలో హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యేపై విచారణ నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.