మార్చ్ వాయిదాపై చేతులెత్తేసిన తెలంగాణ మంత్రులు
తెలంగాణ మార్చ్కు అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదేనని, పైగా మార్చ్లో తెలంగాణ మంత్రులు అగ్రభాగాన ఉండాలని తెలంగాణ జెఎసి అంటోంది. ఈ స్థితిలో తెలంగాణ మంత్రులు మార్చ్లో పాల్గొనడానికి సిద్ధంగా లేనప్పటికీ వాయిదా వేయించే విషయంలో మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి రహస్య మంతనాలు జరిపారు. మార్చ్కు జరిగి తీరుతుందని చెబుతున్న కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావుతో కూడా జానా రెడ్డి చర్చలు జరిపారు.
మార్చ్ను వాయిదా వేయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు సారయ్యను, శ్రీధర్ బాబును కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఆ పనిచేయబోనని శ్రీధర్ బాబు పరోక్షంగా ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రయత్నాలు కూడా ఏ మాత్రం ఫలించడం లేదు. అయితే, తెలంగాణ మంత్రులు తెలంగాణ మార్చ్ను వాయిదా వేయించడానికి అంత సముఖంగా లేరని తెలుస్తోంది.
తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమపై ఆగ్రహంగా ఉన్నారని, మార్చ్ను వాయిదా వేసుకోవాలంటే మరింతగా తమపై విరుచుకుపడతారని తెలంగాణ మంత్రులు భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రికి సహకరించడానికి వారు ఏ మాత్రం ఇష్టంగా లేరని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ మార్చ్లో పాల్గొంటామని ఇది వరకే చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ మార్చ్ను నిర్వహించి తీరుతామని తెలంగాణ జెఎసి నాయకులు అంటున్నారు. నిజానికి, తెలంగాణ విషయంలోనే కాకుండా ముఖ్యమంత్రి ఏకపక్ష వ్యవహారశైలి పట్ల కూడా తెలంగాణ సీనియర్ మంత్రులు అసంతృప్తితో ఉన్నారు.