టెన్షన్: గణేశుడికి తెలంగాణ మార్చ్ సెగ, భారీ భద్రత
నిజానికి, ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం అన్ని విగ్రహాల నిమజ్జన జరిగిన తర్వాత మర్నాడు తెల్లవారు జామున ముగుస్తుంది. కానీ, ఈసారి అదే రోజు రాత్రి 11 గంటల లోపల జరిగిపోవాలని అనురాగ్ శర్మ ఆదేశించారు. తెలంగాణ మార్చ్కు అనుమతి లేదని ఆయన చెప్పారు. బయటివారు తెలంగాణ మార్చ్లో పాల్గొనకూడదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత మార్చ్ను వాయిదా వేసుకుంటే ఆ తర్వాత మార్చ్కు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు.
అయితే, మార్చ్ను వాయిదా వేసుకోవడానకి తెలంగాణ జెఎసి నిరాకరిస్తోంది. వినాయక నిమజ్జనానికి తమ మార్చ్ ఏ విధమైన విఘాతం కలిగించదని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. జై గణేశ, జై తెలంగాణ నినాదంతో ప్రశాంతంగా తెలంగాణవాదులు మార్చ్ నిర్వహిస్తారని ఆయన చెప్పారు. కానీ, పోలీసు అధికారులు ఆ మాటలను విశ్వసించడం లేదు. తెలంగాణ మార్చ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగే పరిస్థితి ఉందని శాంతిభద్రతల డిజి హుడా అన్నారు.
మార్చ్ను అడ్డుకోవడానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరానికి జిల్లా నుంచి వచ్చే మార్గాల్లో చెక్పోస్టులు పెట్టారు. జిల్లాల నుంచి మార్చ్లో పాల్గొనడానికి వచ్చేవారిని ఇక్కడ అడ్డుకుంటారు. భద్రత ఏర్పాట్ల కోసం 20 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. హైదరాబాదుకు రావడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులను పోలీసులు వెనక్కి పంపించి వేస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాదులో జరిగే జీవ వైవిధ్య సదస్సు బందోబస్తుకు పారా మిలిటరీ బలగాలు రావాల్సి ఉండింది. కానీ, వినాయక నిమజ్జనం, తెలంగాణ మార్చ్ సందర్భంగా ముందుగానే వాటిని తరలిస్తున్నారు.
తెలంగాణ మార్చ్ను అడ్డుకోవడానికి తగిన వ్యూహాన్ని రూపొందించామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటున్నారు. మార్చ్ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై, భద్రతపై ఆమె సమీక్ష జరిపారు. తెలంగాణ మార్చ్కు 3 వేల నుంచి 4 వేల మంది రావచ్చునని అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన మిలియన్ మార్చ్ కన్నా తక్కువ మందే ఇప్పుడు రావచ్చునని అంటున్నారు.