ముఖ్యమంత్రి వద్ద క్యూ కట్టిన టిడిపి ఎమ్మెల్యేలు
తన మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారంనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చాలా సమయం గడిపారు. మైలవరం నియోజకవర్గంలో వివిధ పనుల కోసం 18 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటను అడ్డుకుంటామని చెప్పిన తెలుగుదేశం వెనక్కి తగ్గింది. అందుకు కారణమేమిటనేది తెలియదు. కృష్ణా డెల్టాకు సాగు నీరు అందించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శానససభ్యులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
గన్నవరం విమానాశ్రయంలో దిగగానే శానససభ్యులు ఆ వినతిపత్రం అందించారు. స్థానిక శానససభ్యుడు దాసరి బాలవర్ధన రావు ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం విద్యుచ్ఛక్తి చార్జీల పెంపుపై చిన్నపాటి నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం కైకలూరు శానససభ్యుడు జయమంగళం వెంకటరమణ ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొల్లేరు మిగులు భూములకు సంబంధించి ముఖ్యమంత్రి నుంచి వరాలు పొందారు.
పర్యటన ప్రారంభించడానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి శానససభ్యుడితో మాట్లాడి తన పర్యటనను వాడుకోవాలని సూచించారు. తెలుగుదేశం నందిగామ శాసనసభ్యుడు తనిగరల ప్రభాకర రావు బుధవారం వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు. తన నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.