బాబుపై తెలంగాణ: జగన్కు జైకొట్టేందుకే? అదే దార్లో...
జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రవీణ్ ఎప్పటి నుండో చూస్తున్నారని, సమయం కోసం ఆయన ఇన్నాళ్లూ వేచి చూశారని, ఇప్పుడు బాబు తెలంగాణపై ప్రధానికి లేఖ రాయడంతో ఆయనకు ఆయుధం దొరికి ఇప్పుడు తన అసంతృప్తిని వెళ్లకక్కుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం తెలంగాణ పైనే ఆయనకు అసంతృప్తి ఉంటే దానిని ప్రస్తావించి తన విముఖతను వ్యక్తం చేసే వారని, కానీ బాబుపై ఆయన ఈ రోజు(గురువారం) చేసిన వ్యాఖ్యలను బట్టి అలా కనిపించడం లేదంటున్నారు.
బాబును ప్రవీణ్ తీవ్రంగా దూషించారు. టిడిపి పేరును తెలంగాణ దేశంగా పెట్టుకోవాలని, పాదయాత్రలో నిరసన తెలుపుతానని, ఆయన నిర్ణయాల వల్ల పార్టీ అస్తవ్యస్తంగా తయారయిందని, అన్నీ తప్పు నిర్ణయాలే తీసుకున్నారని తీవ్రంగా దూషించారు. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి కితాబిచ్చారు. ఆయనను ఓ పోరాటయోధుడిగా అభివర్ణించారు. జగన్ అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని సూచించారు.
బాబును విమర్శిస్తూ.. జగన్ పార్టీలో చేరుతానని ప్రకటించనప్పటికీ ఆయనకు కితాబు ఇవ్వడం ద్వారా ప్రవీణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్ధమైపోయారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఎప్పటి నుండో ప్రవీణ్ కుమార్తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. చర్చల సమయంలోనే ప్రవీణ్ జగన్కు జై కొట్టినప్పటికీ సమయం కోసమే ఇన్నాళ్లూ వేచి చూశారని అంటున్నారు.
2014 ఎన్నికలలో టిడిపి గెలిచే అవకాశం లేదని, జగన్ గాలి బాగా వీస్తోందని.. ప్రవీణ్ తదితర టిడిపి నేతలపై జగన్ పార్టీ నేతలు మానసికంగా ఒత్తిడి పెంచుతున్నారని అంటున్నారు. జగన్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన వారు తెలంగాణ లేఖ సాకు చూపి పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. ప్రవీణ్తో పాటు పలువురు మరికొందరు సీమాంధ్ర టిడిపి నేతలు జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంత టిడిపి నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారాలనుకున్న నేతలు ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని అంటున్నారు.