పట్టు బిగించిన కోదండరామ్: దిగొచ్చిన తెలంగాణ నేతలు
తెలంగాణ మార్చ్కు తరలివచ్చే ప్రజల మాట అలా ఉంచితే, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు మాత్రం కదిలి రాక తప్పని స్థితి ఏర్పడింది. తెలంగాణ జెఎసికి సమాంతరంగా పనిచేయడానికి సిద్ధపడిన ప్రజా సంఘాలు కూడా తెలంగాణ మార్చ్కు మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల తెలంగాణ నేతలే కాదు, తెరాస నేతలు కూడా ఈ మార్చ్కు కదిలి రాకపోవచ్చుననే అభిప్రాయం ఉంటూ వచ్చింది. అయితే, అందుకు భిన్నంగా అన్ని పార్టీల తెలంగాణ నాయకులు తెలంగాణ మార్చ్పై కదిలి వచ్చారు.
ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పడేసే పద్ధతిలో తెలంగాణ మంత్రులు కూడా వ్యవహరించగలిగారు. తెలంగాణ మార్చ్కు అనుమతి విషయంలో అన్ని పార్టీ తెలంగాణ నాయకులు ఏకమయ్యారు. తెలంగాణ మంత్రులపై బాధ్యత పెడుతూ వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ జెఎసి విజయం సాధించినట్లే చెప్పాలి. తెలంగాణపై కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనలు తెలంగాణ కాంగ్రెసు నాయకులకు మంట పుట్టించాయి. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేరుగా పార్టీ అధిష్టానంపైనే విరుచుకు పడ్డారు.
కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మొదటి నుంచి తెలంగాణ మార్చ్ విషయంలో గట్టిగా నిలబడ్డారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా ఏదో మేరకు తమ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీలోని తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య పూడ్చలేని గండి ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఈ విషయంలో కూడా కోదండరామ్ విజయం సాధించినట్లే చెప్పాలి.
కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావు తెలంగాణ జెఎసికి పూర్తిగా మద్దతుగా నిలబడ్డారు. పార్టీ అధిష్టానాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రత్యక్షంగా ధిక్కరించినట్లే. తెలంగాణ మార్చ్ విషయంలో తెలంగాణ మంత్రులు కూడా గట్టిగానే వ్యవహరించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య మానసికంగా దూరం పెరిగినట్లే అనిపిస్తోంది. పరస్పర విశ్వాసం నెలకొనే పరిస్థితి ఉంటుందా అనేది కూడా అనుమానంగానే ఉంది.