ఎన్టీఆర్పై తప్పుడు ప్రచారం, జగన్ పార్టీలోనూ..: ప్రవీణ్
తాను ఇంకా టిడిపిలోనే ఉన్నానని, అయితే తెలంగాణపై లేఖ ఇవ్వడాన్ని తాను తప్పు పడుతున్నానని చెప్పారు. లేఖతో పాటు చంద్రబాబు తొలి నుండి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, దీనిపై పార్టీలోని చాలామంది నేతల్లో అసంతృప్తి ఉందన్నారు. తాను బయటకి వచ్చి బాబు తీరును తప్పు పట్టానని, మిగతా వారు కూడా సమయం వచ్చినప్పుడు బయటకు వస్తారని ప్రవీణ్ రెడ్డి చెప్పారు.
తనకు జగన్ పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీలోను బంధువులు ఉన్నారన్నారు. జైల్లో ఉన్న సునీల్ రెడ్డి తనకు అత్యంత దగ్గరి బంధువు, అయితే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను పరామర్శించేందుకు కూడా వెళ్లలేదన్నారు. సమైక్యాంధ్ర విషయంలో జగన్ పార్టీలోనూ స్పష్టత లేదన్నారు. బాబు నాయకత్వంలో లోపం ఉందని, హీరో జూనియర్ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలను చూస్తే జగన్కు ప్రజల మద్దతు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
అయితే తాను మాత్రం ఇప్పటి వరకు జగన్ పార్టీలో చేరాలనే భావనతో లేనన్నారు. తెలంగాణపై బాబు ఇచ్చిన లేఖతో ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కానీ కొందరు బయటపడటం లేదన్నారు. బాబు లేఖతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అది అందర్నీ కన్ఫూజన్ చేసే విధంగా ఉందన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెసే సైలెంట్గా ఉన్నప్పుడు లేఖ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందన్నారు.
సమైక్యాంధ్ర కోసం తాను పోరాడుతానన్నారు. తన భవిష్యత్తుపై ఇంకా చర్చించలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బాబు లేఖ ఇచ్చారన్నారు. కెబిఆర్ పార్కులో కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసినా, మార్చ్ నిర్వహిస్తున్నా పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ తొమ్మిదేళ్లు కష్టపడితే విద్యార్థులు తెలంగాణ కోసం బయటకు రాలేదని, కానీ సమైక్యాంధ్ర కోసం ప్రజలు డిసెంబర్ 9న ప్రకటన రాగానే వచ్చారన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఐక్యత కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆ మంచి ఆశయాన్ని అలాగే ఉంచాలని సూచించారు. పార్టీ విధానాలు మార్చుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు అనుకూల మీడియా ఇష్టారీతిగా తాను జగన్ పార్టీలో చేరతానని ఆరోపిస్తోందని మండిపడ్డారు.