ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు యోచనలో తెలుగుదేశం
ప్రవీణ్, అమర్నాథ్లు బాబు వైఖరిపై విరుచుకపడ్డారు. టిడిపి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఇందుకు బాబు నిర్ణయాలే కారణమని వారు ఆరోపించారు. 2009 నుండి బాబు తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా లేవని, అందుకే ప్రజలను మెప్పించలేక పోయామన్నారు. బాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీంతో పార్టీలోని చాలామంది నేతలలో తీవ్రమైన అసంతృప్తి ఉందని వారు అన్నారు. బాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
దీంతో వారిపై వేటు వేయాలని చంద్రబాబును పలువురు నేతలు కోరుతున్నారట. ఇంత ఘాటుగా విమర్శిస్తున్నా విస్మరిస్తే మొదటికే మోసం వస్తుందని, కాబట్టి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతున్నారట. వారిపై వేటు విషయంలో పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోక పోవడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని చెబుతున్నారట.
అయితే ఆ తర్వాత వల్లభనేని వంశీకి నోటీసులు ఇవ్వడం, మైసూరా రెడ్డి, కొడాలి నాని, చిన్నం రామకోటయ్యపై తక్షణమే స్పందించడంతో అంతా సర్దుకుందని, ఇప్పుడు కూడా వెంటనే వారిపై చర్యలు తీసుకుంటేనే మంచిదని చెబుతున్నారట. ఇటీవల మైసూరా రెడ్డిపై పార్టీ క్షణాల్లో వేటు వేసింది. వేటుకు ముందు వారి నుండి వివరణ తీసుకోవాలని సూచిస్తున్నారట.