నెక్లెస్ రోడ్డుపై తెలంగాణ మార్చ్: ప్రభుత్వ అనుమతి
తెలంగాణ మార్చ్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి ప్రకటించారు. తెలంగాణ మార్చ్ను శాంతియుతంగా జరుపుతామని జెఎసి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలుగు ప్రజల సామరస్యానికి భంగం కలగకుండా చూస్తామని చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. నెక్లెస్ రోడ్డుపై ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కవాతుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రెండున్నర గంటల పైగా తెలంగాణ మంత్రులు అటు ముఖ్యమంత్రితోనూ ఇటు తెలంగాణ జెఎసి నేతలతోనూ చర్చలు జరిపారు. ఈ చర్చల ద్వారా ఒక రాజీ ఫార్ములా వంటిదాన్ని ముందుకు తీసుకువచ్చారు. చివరికి నలుగురు మంత్రుల చొరవతో ఒకరోజు మార్చ్కు ప్రభుత్వం అంగీకరించింది. రెండు రోజులపాటు మార్చ్ నిర్వహించడానికి అనుమతించాలని తెలంగాణ జెఎసి గట్టిగా కోరింది. అయితే అందుకు సుతరామూ ఒప్పుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం తెలంగాణ మంత్రులు ఈ విషయమై పట్టుపట్టవద్దని జెఎసిని కోరడంతో వారు అందుకు అంగీరించినట్టు తెలుస్తున్నది.
తెలంగాణ మార్చ్ను ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించేది లేదని, ఒకవైపు నిమజ్జనం జరుగుతుంటే, అందులో పాల్గొనడానికి వేలాది మంది ప్రజలు వస్తుంటే, మరోవైపు శాంతి భద్రతల పరిస్థితిపై అనుమానాలు కలిగించే మార్చ్ను ఎలా అంగీకరిస్తామని ఇన్ఛార్జి డిజిపి దినేశ్ రెడ్డి శుక్రవారంనాడు మీడియా సమావేశంలో గట్టిగా ప్రశ్నించారు. పరిస్థితులు చేజారకుండా చూడడానికి ఆందోళనకారులు ఎవ్వరూ భరోసా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆరోజున మొత్తం టాంక్బండ్ పోలీసుల అధీనంలో ఉంటుందని ఆయన చెప్పారు.
అదే సమయంలో తెలంగాణ మంత్రులు తెలంగాణ మార్చ్కు అనుమతి ఇవ్వవలసిందేనని ముఖ్యమంత్రిని కోరుతుండగానే డిజిపి తేదీని మార్చుకోండి, లేదా వేదికను మార్చుకోండి అని గట్టిగా చెప్పారు. ప్రభుత్వం కేసులు పెడతామని బెదరిస్తే ఒక్క శాఖ మీ దగ్గరుంటే మిగిలిన శాఖలన్నీ తమ దగ్గరే ఉన్నాయని తెలంగాణ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని విడుదల చేసి పాలనా వ్యవహారాలు తాపీగా జరగడానికి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ సారి ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఆ తర్వాత తెలంగాణ మంత్రులకు, జెఎసికి మధ్య జరిగిన చర్చలు, ఆ తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా నెక్లెస్ రోడ్డుపై మార్చ్కి అంగీకారం కుదిరింది.