తెలంగాణ ప్రకటన వచ్చే వరకు ఇక్కడే: ఒయు జెఎసి
నెక్లెస్ రోడ్డుపై జరిగేది తెలంగాణ మార్చ్ కాదని, ప్రభుత్వ మార్చ్ అని ఆయన విమర్శించారు. తమ కవాతు ఒయు నుంచి ట్యాంక్బండ్ వరకు సాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి మార్చ్లో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ కవాతును ప్రశాంతంగా నిర్వహించాలని గద్దర్ సూచించారు. మంత్రులు ప్రజలతో మమేకం కావడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రజలతో నడిచేవారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలకు ఏ విధమైన హానీ జరగదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య రాజకీయపరమైందని, ఉద్యమాల ద్వారా సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
విద్యార్థి నాయకులను ఆహ్వానించి చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమమంటే రాజకీయ నాయకులది కాదని, విద్యార్థులదేనని ఆయన అన్నారు. గణేశుడు తెలంగాణ కవాతు ప్రశాంతంగా జరగడానికి సహకరిస్తాడని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చేసిందని, అందరి మనస్సులో తెలంగాణ రావాలని ఉందని, సంతకాలు మాత్రమే జరగాల్సి ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.