ఏడాది తర్వాతే, చర్చలతోనే...: తెలంగాణపై టిజి వెంకటేష్
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆమరణ దీక్ష చేస్తే ఒరిగేదేమీ లేదని మంత్రి అన్నారు. తెలంగాణ సమస్య ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉందని అన్నారు. ఎల్లుండి ప్రతినిధి బృందంతో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కోస్తాంధ్రకు చెందిన మంత్రి తోట నరసింహం అన్నారు. అయితే తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణ అంశంపై ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పందించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సులువైన మార్గాలు లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఇరు ప్రాంతాలవారు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
తెలంగాణ చాలా సున్నితమైన, భావోద్వేగపరమైన, వివాదాస్పద అంశమని మనీష్ తివారీ అన్నారు. అందువల్ల తెలంగాణపై అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తిరిగి వచ్చిన తర్వాతనే తెలంగాణపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి.