ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటే రాదు: కెసిఆర్పై విమలక్క
రాయబారాలు చేస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. పోరాటాలు చేయాలన్నారు. వాళ్లు ఉండాల్సింది అక్కడ కాదని, ఇక్కడేనన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటమే ప్రధానమని చెప్పారు. కేసులు ఎత్తివేసి తెలంగాణ వాదులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళని ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. నిజాంపై తిరుగుబాటు చేయడమే కాకుండా అప్పట్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద విని త్యాగం చేసిన బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని కులవృత్తులకు ఆర్థిక సహాయం అందించేందుకు సహకార సంఘాల స్థాపనను ప్రోత్సహించారని చెప్పారు.
ఆదివారం ఉదయం ఎగ్జిబిషన్ మైదానం గాంధీ సెంటినరీ హాల్లో పద్మశాలి యువజన సంఘాల ఆధ్వర్యంలో, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన బాపూజీ సంస్మరణ సభలో గద్దర్ మాట్లాడారు. తెలంగాణ కోసం విరామమెరుగక పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ అన్నారు. ఆయన జీవితాశయాన్ని సాధించేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.