ప్రారంభమైన బయోడైవర్సిటీ: జయంతి ప్రారంభోపన్యాసం
సవాళ్లను ఎదుర్కొని భవిష్యత్తు తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించాల్సిన అవసరం, బాధ్యత ఉందని ఆమె అన్నారు. భారతదేశం మెగా జీవ వైవిధ్య కేంద్రంగా అవతరిస్తోందని ఆమె అన్నారు. మానవ ఆరోగ్యం, మెరుగుదల కోసం జీవ సమతౌల్యం అవసరముందని, ప్రపంచ జీవ వైవిద్య పరిశోధనల పైన దృష్టి సారిస్తున్నాయని అన్నారు. పరిశోధనలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. పర్యావరణ సమస్యలే జీవ వైవిధ్యానికి అడ్డంకి అన్నారు.
కాగా దాదాపు పద్దెనమిదిసంవత్సరాల క్రితం.. 1994 నవంబర్లో జీవ వైవిధ్యంపై తొలి సదస్సు (కాప్-1) బహమాస్లో జరిగింది. అప్పట్నుంచీ ప్రతి రెండేళ్లకొకసారి ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతోంది. అందులో భాగంగానే కాప్-11కు హైదరాబాద్ వేదికైంది. నగోయా (జపాన్)లో జరిగిన గత సదస్సు తీర్మానాల అమలు తీరుతెన్నులపై ఈ సదస్సులో చర్చించనున్నారు. జీవ వైవిధ్యంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
సదస్సు జరిగే హైటెక్స్ ప్రాంగణంతో పాటు భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు అంతర్జాతీయ పోలీసు బలగాల నీడలో ఉన్నాయని సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఐక్య రాజ్యసమితి పోలీసుల కనుసన్నల్లో ఈ సదస్సు జరగనుంది. వీరికితోడు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు సాగాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీగా రంగంలోకి దిగాయి. సదస్సులో కీలకమైన అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో 3000 మంది ఐక్యరాజ్యసమితి భద్రత సిబ్బంది రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతి ఒక్కరినీ ఆధునిక పరికరాలతో స్కానింగ్ చేస్తారు.
జోన్ 2గా పరిగణించే హైటెక్స్ 1, 2 హాళ్లతో పాటు నోవాటెల్, పార్కింగ్ ప్లేస్లనూ పూర్తిగా స్కాన్ చేస్తారు. ఇక జోన్ 3లో హైటెక్స్లోని ఎగ్జిబిషన్, డెలిగేట్స్ ఉండే ప్రాంతాలు ఉన్నాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు రాకపోకలు సాగించే రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, అయ్యప్ప సొసైటీ రహదారుల్లో ఆంక్షలు విధించనున్నారు. మొత్తం 200 సీసీ కెమెరాలతో నిరంతరం పోలీసులు డేగ కళ్లతో పహరాకు సిద్ధమయ్యారు.