సిఎంకు ఎమ్మెల్సీల అండ, లేఖ: దమ్ముంటే... జగ్గారెడ్డి
ఎంపీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే వారి ప్రతాపాన్ని ఢిల్లీలో చూపి తెలంగాణ తీసుకు రావాలని సవాల్ విసిరారు. ఎంపి వివేక్ లేఖ అర్థం పర్థం లేనిదన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిఎంని విమర్శిస్తూ లేఖ రాయడం పార్టీని బజారుకీడ్చడమే అని ఆరోపించారు. మీడియాకెక్కితే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. మీడియా ముందు మాట్లాడటం, కిరణ్ను విమర్శించడం కాకుండా ఢిల్లీలో తేల్చుకోవాలని వారికి సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఎంపీలు కాంగ్రెసు తరఫున పోటీ చేస్తారనే నమ్మకం లేదన్నారు. తెలంగాణ అంశంతో కిరణ్కు సంబంధం లేదని, అలాంటప్పుడు ఆయనను విమర్శించడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ వస్తున్న సమయంలో సొంతపార్టీ ఎంపీలు ప్రకటన వెనక్కి వెళ్లేలా చేస్తున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి న్యూఢిల్లీలో మండిపడ్డారు. అధిష్టానం పైన విశ్వాసం లేనివాళ్లే కిరణ్ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.
ఎంపీలపై ఎమ్మెల్సీల ఫిర్యాదు లేఖ
ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసు పార్టీ శాసనమండలి సభ్యులు మంగళవారం అధిష్టానానికి లేఖ రాశారు. పెద్దపల్లి ఎంపి వివేక్ ఏనాడు కాంగ్రెసు జెండా పట్టలేదని, కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ సొంత పార్టీ నేతపై పోటీ చేసి సస్పెండ్కు గురయ్యారని, అలాంటి వారు కిరణ్ను విమర్శించడం సరికాదని వారు లేఖలో పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన ఎంపీకి కాంగ్రెస్ మళ్లీ అవకాశం ఇచ్చి గెలిపించిందని, కానీ ఆయన మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేకర రావుతో బేరం మాట్లాడుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెసు ఎంపీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు లేఖలో అధిష్టానాన్ని కోరారు. వెంటనే చర్యలు తీసుకోకుంటే తెలంగాణలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని వారు తెలిపారు. ఈ లేఖలో ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, ప్రభాకర్, రాజేశ్వర రావు, ఫరూక్లు సంతకాలు చేశారు. ఎమ్మెల్సీ రంగారెడ్డి సంతకాలు సేకరించారు.