సోనియాకు ఖర్చు: మోడీ సవాల్, డిఫెన్స్లో కాంగ్రెస్
మోడీ సవాల్ కాంగ్రెసును ఆత్మరక్షణలో పడేసిందని అంటున్నారు. ఆర్టీఐ ద్వారా హర్యానాలోని హిసార్కు చెందిన ఓ వ్యక్తి సోనియా గాంధీ విదేశీ ఖర్చుల వివరాలని అడిగారని, ఇది జూలై 12 నాటి పత్రికలలో వచ్చినదని, తన ఆరోపణలకు అదే మంచి సాక్ష్యమని మోడి అన్నారు. అయితే సదరు ఆర్టీఐ కార్యకర్త మాత్రం తనకు సోనియా ఖర్చుకు సంబంధించిన పత్రాలు ఇంకా రాలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆర్టీఐ కార్యకర్తకు పత్రాలు అందక పోవడం ఖర్చులు తెలిపే ఉద్దేశ్యం లేకపోవడమే అని చెబుతున్నారు.
కాగా సోమవారం నరేంద్ర మోడి సోనియాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె విదేశీ పర్యటనల కోసం కేంద్రం రూ.1880 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటిస్తోన్న మోడీ జెసర్లో నిర్వహించిన ప్రదర్శనలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా పర్యటనలు, హోటళ్ల ఖర్చుల కోసం వెచ్చించిన ఖర్చు.. భావన్ నగర్, జామ్ నగర్, జూనాగఢ్, రాజ్ కోట్ మున్సిపల్ కార్పోరేషన్లకు వార్షిక బడ్జెట్ల కన్నా అధికంగా ఉందన్నారు.
హర్యానాకు చెందిన ఓ యువకుడు ఈ సమాచారాన్ని సహ చట్టం ద్వారా కోరారని, ఓ పత్రిక ప్రచురించిందన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రభుత్వ ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక విమానం సదుపాయాన్ని సోనియా ఏ అర్హతతో వినియోగించుకుంటున్నారని ప్రశ్నించారు. అయితే మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెసు అధికార ప్రతినిధి మనీష్ తివారి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. అయితే కాంగ్ వ్యాఖ్యలకు మోడీ సవాల్ విసిరారు. తన ఆరోపణలు తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని మంగళవారం ప్రకటించారు.