పాలిటిక్స్ తెలియవు: నాగం, బాబుయాత్రపై రాఘవులు
కడుపు నిండిన మంట... శంకర రావు
సీమాంధ్ర నేతలది కడుపు నిండిన మంట అయితే తెలంగాణ ప్రజలది ఆకలి మంట అని మాజీ మంత్రి శంకర రావు అన్నారు. తెలంగాణ అంశంపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న గుంటూరు, విజయవాడ, ఏలూరు ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావులపై కేసులు పెట్టాలన్నారు. తెలంగాణపై కాంగ్రెసు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బాబు యాత్ర ఓకే కానీ.. రాఘవులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయాలు తెలియవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. తెలంగాణ రాజకీయ అంశం కాదని చెప్పడం సరికాదన్నారు. కేంద్రం తెలంగాణ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత నెల 30వ తేదిన తెలంగాణ కవాతు సమయంలో హడావుడి చేసిన కాంగ్రెసు నేతలు తర్వాత తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టడం ఆహ్వానించదగ్గదే అన్నారు. యాత్ర చేసి ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవడంలో తప్పు లేదన్నారు. అయితే కీలకమైన రాజకీయ అంశాల పైన స్పష్టత ఇచ్చి ఆయన పాదయాత్ర చేస్తే బాగుండేదని రాఘవులు అభిప్రాయపడ్డారు.