మీతెలివి, క్రెడిట్ మోడికి: గుజరాతీలకి సోనియా కితాబు
కాంగ్రెసు ప్రభుత్వం చేసిన సంస్కరణ ఫలాల్ని అనుభవిస్తూ కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని మోడీని ఉద్దేశించి విమర్శించారు. నర్మదా ప్రాజెక్ట్ ఘనత కాంగ్రెసుదే అన్నారు. సౌరాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ నర్మద నీరు అందడం లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. గుజరాత్ అభివృద్ధి తన వల్లే జరిగిందంటున్న మోడీ కేంద్రం నుండి వస్తున్న 50 శాతం నిధుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
మోడీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రపంచంలో గుజరాతీలు ఎక్కడున్నా తెలివిగా బతగ్గలరని, కానీ మోడీ మాత్రం గుజరాతీల ఘనతను తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. చిల్లర వర్తకంలోకి ఎఫ్డిఐలను ఆమోదించడం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సోనియా ఎఫ్డిఐలతో పాటు డీజిల్ ధరల పెంపును కూడా సమర్థించుకున్నారు. అవినీతిపై భారతీయ జనతా పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
లోక్పాల్ బిల్లును పార్లమెంటులో బిజెపియే నీరుగార్చిందని ఆరోపించారు. గుజరాత్లో విలువ ఆధారిత పన్ను ఎక్కువగా ఉందని, రైతులకు తగిన ప్రతిఫలం అందడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఇప్పటికీ అనుసరిస్తోందన్నారు.