తెలంగాణ నివేదికపై జస్టిస్ శ్రీకృష్ణ సంచలన వ్యాఖ్యలు
కమిటీ వేసినప్పుడే తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలని కేంద్రం కోరిందని, ఏకైక మార్గం చూపాలని తమకు సూచించలేదని జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. తమ నివేదికలో తికమక ఏమీ లేదని, తమ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే వీలుందని అన్నారు. రాజకీయాలతో ముడిపడి ఉన్నందు వల్లనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల తీరుపై ఆయన మండిపడ్డారు. రాజకీయ నేతల వల్లనే తెలంగాణ సమస్య జఠిలం అవుతోందని ఆయన అన్నారు.
తాము ఇచ్చిన నివేదికను చదివారో లేదో అని అన్నారు. చదివినా వారికి అర్థమైందో లేదోనని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని ఆయన అన్నారు. రాజకీయావసరాల నిమిత్తమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తాము అదే పని చేశామని ఆయన అన్నారు. కేంద్రం అడిగినట్లే నివేదిక ఇచ్చామని అన్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత మరోలా మాట్లాడడం దారుణమని జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. తనపై విమర్శలు వస్తాయని ముందే ఊహించానని ఆయన అన్నారు.
జస్టిస్ శ్రీకృష్ణ మాటలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తీవ్రంగా మండిపడ్డారు. జస్టిస్ శ్రీకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ న్యాయమూర్తి కాదు, అన్యాయమూర్తి అని తేలిపోయిందని ఆయన గురువారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం అత్యంత దారుణంగా ఉందని, ఆ అధ్యాయాన్ని ప్రధాని లేదా మరెవరి సూచన మేరకు ఇచ్చారో, లేదంటే సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు అమ్ముడుపోయి ఇచ్చారో తేలాలని, అది తేలాలంటే విచారణ జరిపించాలని ఆయన అన్నారు.
తెలంగాణ వంటి పెద్ద సమస్యపై అధ్యయానికి వేసిన కమిటీకి చైర్మన్గా వేస్తే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే నివేదిక ఇచ్చామని శ్రీకృష్ణ అనడం తెలంగాణ ప్రజలను వంచించడమేనని కెటిఆర్ అన్నారు. నాటకంలో సూత్రధారులు కేంద్రం, పాత్రధారుం తాము అని శ్రీకృష్ణ చెప్పారని వ్యాఖ్యానించారు. కమిటీకి పెట్టిన ఖర్చులను సభ్యుల నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.