జెడి కాల్లిస్ట్, భాను కేసుల్లో దూకుడు: ఇక అరెస్టులే?
కాల్ డేటా, మద్దెలచెర్వు సూరి కేసుల్లో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసేందుకు ఇన్నాళ్లూ జాప్యం చేసిన సిఐడిఇప్పుడు నిందితులకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమైంది. పలు కేసుల ప్రస్తుత పరిస్థితిని గత వారం రోజులుగా సిఐడి చీఫ్ రమణ మూర్తి క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులను పిలిచి తన పరిశీలనకు, దృష్టికి వచ్చిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. భూకబ్జా, బెదిరింపులు, ఆర్థిక నేరాల కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
అరెస్టులో జాప్యం గురించి విలేకరులు ఎప్పుడడిగినా అరెస్టు ముఖ్యం కాదని, ఎవిడెన్స్ కలెక్షన్ ఇంపార్టెంటని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన సిఐడి అధికారులు తాజా ఆదేశాల నేపథ్యంలో పలు కేసుల్లో సాక్షులను పిలిపించి వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రారంభించారు. సెప్టెంబర్ ఆఖరికి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సిబిఐ జెడి కాల్ డేటా ఉదంతంలో పారిశ్రామికవేత్త రఘురామరాజుకు ముందస్తు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో పోలీస్ అధికారి, సాక్షి విలేకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. మద్దెలచెర్వు సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ కేసులో నిందితులు న్యాయవాది శ్రీకాంత్ గౌడ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సినిమా నిర్మాతలు సి.కల్యాణ్, శింగనమల రమేశ్ ఇలా పలువురి అరెస్టు విషయంలో ఇన్నాళ్లూ జాప్యం చేసిన సిఐడి... ఇప్పుడిక నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. నట్టి కుమార్ అనే నిర్మాతను స్వయంగా సిఐడి చీఫ్ పిలిపించి కళ్యాణ్ బెదిరింపులపై విచారించారని సమాచారం.
ఇక శ్రీకాంత్ గౌడ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కూడా అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా, అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు కల్యాణ్ పలువురు నిర్మాతలను రంగంలోకి దించడం, ఇక అరెస్టు ముప్పు తప్పినట్టేనని భావించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేసుకోవడం తెలిసిందే. అయితే, ఫిలిం చాంబర్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కల్యాణ్ కథ అడ్డం తిరిగింది. మద్దతుగా నిలిచిన ఆ నిర్మాతలు సైతం ముఖం చాటేసినట్టు సమాచారం. దీంతో ఆయన మరింత ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.