వీరు వారు: కోదండరామ్తో భేటీకి కెసిఆర్ నో
తెలంగాణ మార్చ్ను విజయవంతం చేయడానికి సహకరించిన రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కొక్కరికే తెలంగాణ జెఎసి నేతలు గురువారం కృతజ్ఞతలు చెబుతూ వచ్చారు. అదే వరుసలో కెసిఆర్ను కూడా కలిసి కృతజ్ఢతలు చెప్పాలని భావించారు. కానీ, కెసిఆర్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. బిజెపి, సిపిఐ నాయకులను, స్వతంత్ర శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని టిజెఎసి నేతలు కలిశారు.
కెసిఆర్ అపాయింట్మెంట్ కోసం ఒకటి రెండు రోజులు ఆగాలని తెరాస సీనియర్ నాయకులు టిజెఎసి నేతలతో చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు పెద్దలతో చర్చలు జరిపి ఢిల్లీ నుంచి తమ నాయకుడు కెసిఆర్ నెల రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారని, అందువల్ల ఆయనను కలవడానికి ఆగాలని వారు చెప్పారు. తాము కెసిఆర్ను ఈ రోజే కలిసి భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడాలని అనుకున్నామని, అయితే కెసిఆర్ తీరిక లేదని, కెసిఆర్ను కలవడానికి సమయం పడుతుందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తమతో చెప్పారని, శనివారంనాడు తమకు కెసిఆర్ అపాయింట్మెంట్ లభిస్తుందని అనుకుంటున్నామని టిజెఎసి నాయకులు చెప్పారు.
కెసిఆర్ను ఎప్పుడు కలవాలనే విషయం తెరాస నాయకులు చెబుతారని కోదండరామ్ అన్నారు. తాము తెలంగాణ అనుకూల పార్టీల నాయకులందరినీ కలవాలని అనుకున్నామని, అదే వరుసలో కెసిఆర్ను కలుద్దామని వచ్చామని, త్వరలో కెసిఆర్తో సమావేశం జరుగుతుందని అనుకుంటున్నామని ఆయన వివరించారు.
తెరాస అధ్యక్షుడు కెసిఆర్ న్యూడెమొక్రసీ నాయకులతో సమావేశం కావడమే కాకుండా తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమై ఢిల్లీ పరిణామాలను వివరించారు. టిజెఎసి నాయకులతో కలవకూడదని కెసిఆర్ ఏమీ అనుకోవడం లేదని, టిజెఎసి నేతలతోనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనవారందరినీ ఆయన కలువాల్సి ఉందని, అందరినీ కలిసి రాష్ట్ర సాధనకు పకడ్బందీ వ్యూహరచన చేయాల్సి ఉందని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు.
ఇదిలావుండగా, తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారు. ఈ సమావేశానికి బిజెపి, సిపిఐ, న్యూడెమొక్రసీ పార్టీలతో పాటు తెరాసను కూడా ఆహ్వానించనుంది.