మరో మార్చ్కోసం జెఏసి ప్లాన్: ప్రధానికి తాకనున్న సెగ
అలాగే నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని అడ్డుకుంటూ గ్రామగ్రామాన నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజా ప్రతినిధులంతా ఐక్యంగా కృషిచేసేలా ఒత్తి డి పెంచడంపైనా చర్చించినట్లు తెలిసింది. కవాతు విజయవంతం చేసిన పార్టీలు, నేతలకు ధన్యవాదాలు చెప్పడంలో భాగంగా... శనివారం మధుయాష్కీ నివాసంలో ఎంపీలు రాజయ్య, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, బలరాం నాయక్, రాజయ్య, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్లతో ఐకాస నేతలు కోదండరాం, శ్రీనివాస్ గౌడ్, రఘు, గద్దర్ తదితరులు భేటీ అయ్యారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ కవాతు తరహాలో మున్ముందు మరింత తీవ్రస్థాయిలో ఉద్యమాలుంటాయని ఆయన ప్రకటించారు. వెయ్యిమందికిపైగా యువత బలిదానం చేసుకున్నా చలించని ప్రభుత్వం... ఉద్యమం సందర్భంగా రాయిపడి అద్దాలు పగిలితే మాత్రం ఆస్తులు ధ్వంసమయ్యాయంటూ విలువ కడుతోందని మండిపడ్డారు. మార్చ్ విజయవంతానికి పార్టీలన్నీ సహకరించాయని, అనుమతి సాధనలో, విజయవంతం చేయడంలో ఎంపీలు బాగా సహకరించారని, ఇది మున్ముందు కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మార్చ్ ప్రభావం యావత్ రాష్ట్రంపై పడిందన్నారు.
ఆ రోజున ఎంపీల అరెస్టును ఖండించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడం, మార్చ్కు వస్తున్న వారిని అరెస్టు చేయడం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడాలని ప్రయత్నించిన ఎంపీలను అరెస్టు చేయడం దారుణమన్నారు. నిరసన తెలిపేందుకు రెండోసారి వెళ్లిన ఎంపీలను అరెస్టు చేసి ఏడు గంటలవరకూ నిర్బంధించడం అమానుషమన్నారు. ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అన్నారు. ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి పోలీసు పికెట్లు ఉన్నచోటే అల్లర్లు జరిగాయని.. లేనిచోట ప్రజలు ప్రశాంతంగా తరలి వచ్చారని చెప్పారు. అల్లర్లకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం మానేసి... ప్రశాంతంగా వ్యవహరించిన ఉద్యమకారులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ఎంపీలతో ఉద్యమ కార్యాచరణపై చర్చ కోసం వారితో సమావేశం కాలేదని, వారికి అభినందనలు తెలిపేందుకు మాత్రమే భేటీ అయ్యామని కోదండరాం చెప్పారు. కాగా ఎవరు పోరాడినా తమ మద్దతు ఉంటుందని కెకె చెప్పారు.