తెలంగాణకోసం కొత్త పార్టీ: టిఆర్ఎల్డీ ప్రెసిడెంట్గా ఇందిర
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ సతీమణి కపిలవాయి ఇందిరను తెలంగాణ ఆర్ఎల్డీ అధ్యక్షురాలిగా అజిత్ సింగ్ నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా రమా మధుసూధన్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహ్మద్ రియాజ్ను నియమించారు. ఈ సందర్భంగా అజిత్ సింగ్ మాట్లాడారు.
తెలంగాణ తరహా ఉద్యమాన్ని తాను దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ఉద్యమం గ్రామగ్రామాన విస్తరించడంతో ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాలలో కూడా తిరగలేక పోతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉందన్నారు. సకల జనులు ఉద్యమంలో పాల్గొంటున్నారని, దేశంలో ఇంత పెద్ద ఆందోళన లేదన్నారు. వచ్చే ఎన్నికలలో తాము తెలంగాణ ఆర్ఎల్డీ తరఫున పోటీ చేస్తామని చెప్పారు.
కాగా అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న అజిత్ సింగ్... తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టతరమని అన్నారు. ఆయన ఆర్ఎల్డీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందని ప్రకటనలు ఏళ్ల తరబడి వింటూనే ఉన్నామన్నారు. తెలంగాణవారంతా ఏకతాటిపై ఉన్నారన్నారు.
తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు ఎంపీలు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాడితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఢిల్లీలో తెలంగాణకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఐక్యంగా పోరాడాలన్నారు. తెలంగాణ అంశం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని, ఇటీవల జరిగిన కవాతు పైన ఢిల్లీలో కూడా చర్చ జరిగిందన్నారు.