కెసిఆర్కు చెక్: తెలంగాణ ఆర్ఎల్డీ కాంగ్రెస్ వ్యూహమా?
ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కపిలవాయి ఇందిరను నియమించారు. ఈమె కెసిఆర్తో విభేదిస్తున్న ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సతీమణి. ప్రధానంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు అజిత్ సింగ్ పార్టీని స్వాగతిస్తున్నారు. కాంగ్రెసు ఎంపీలుగా ఉన్న వారు తెలంగాణ ఆర్ఎల్డీని స్వాగతించడం గమనించదగ్గ విషయం. వీటన్నింటినీ పరిశీలిస్తే తెలంగాణలో కీలకంగా ఉన్న టిఆర్ఎస్ను, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దక్కించుకున్న కెసిఆర్ను దెబ్బతీసేందుకే వ్యూహాత్మకంగా కొత్త ఉద్యమ పార్టీ పుట్టుకు వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైనప్పటికీ 2009 డిసెంబర్ తర్వాత ఈ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. అప్పటి నుండి ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో తిరుగు లేకుండా పోయింది. టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు పలువురు రాజీనామా చేసి మరీ తెరాసలో చేరుతున్నారు. అయితే ఇటీవల సిపిఐ, బిజెపి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో తెరాస హవా కొద్దిగా తగ్గినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీయే లీడర్గా కొనసాగుతోంది.
అయితే తెరాసకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రాంతంలో బిజెపి ఎదిగినా కాంగ్రెసుకు వచ్చే లాభమేమీ లేదు. దీంతో తెలంగాణపై ఎటూ తేల్చలేక పోతున్న కాంగ్రెసు ఆర్ఎల్డీ ద్వారా ఆ ప్రాంతంలో మిగిలిన పార్టీలకు చెక్ చెప్పేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కెసిఆర్ విలీనం చేస్తానని ప్రకటించినప్పటికీ ఆయన మాటలపై రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేయలేదనే వార్తలు కూడా వచ్చాయి. తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేయకుండానే 2014 లక్ష్యంగా కాంగ్రెసు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇలా చేయక తప్పదని ఇంకొందరు చెబుతున్నారు.
తెలంగాణపై ప్రకటన తేల్చకుంటే సీమాంధ్రలో తమ బలం అలాగే ఉంటుందని కాంగ్రెసు భావిస్తుండవచ్చునని చెబుతున్నారు. అయితే తెలంగాణలో తగ్గనున్న తమ బలాన్ని ఆర్ఎల్డీ ద్వారా భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. కాంగ్రెసు ఎంపీలు బలంగా అజిత్ పార్టీని బలపర్చడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అజిత్ తెలంగాణకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన కాంగ్రెసు మరో పార్టీని ప్రోత్సహించడమేమిటని మరికొందరు ఖండిస్తున్నారు.
విలీనంపై కెసిఆర్ తగ్గలేదా
యూపిఏ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేసేందుకు కెసిఆర్ సిద్ధమని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కెసిఆర్ విలీనంపై తగ్గకుండా కేవలం మద్దతుగా ఉంటామని చెప్పడం వల్లనే కాంగ్రెసు పునరాలోచనలో పడిందా లేక కెసిఆర్ విలీనం పైన రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా నమ్మకం లేక అనే ప్రశ్నలు పలువురిని తొలుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉద్యమ పార్టీగా ఆర్ఎల్డీ రావడంతో మంత్రి టిజి వెంకటేష్ చెప్పినట్లుగా 2014 ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణపై ప్రకటన ఉంటుందా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.