ఎట్టకేలకు శ్రీలక్ష్మికి జనవరి 20 వరకు బెయిల్ మంజూరు
బెయిల్ ఇస్తూ శ్రీలక్ష్మికి షరతులు విధించింది. పాస్పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. ఎవరితోనూ మాట్లాడకూడదని కోర్టు శ్రీలక్ష్మిని ఆదేశించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని చెప్పడానికి ఆమె తరఫు న్యాయవాదులు వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు సమర్పించారు.
శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో శ్రీలక్ష్మి ఆరవ నిందితురాలు. ఈ కేసులో ఆమెను సిబిఐ అధికారులు నిరుడు నవంబర్ 28వ తేదీన అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఒక్క రోజు మాత్రమే జైలులో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టు సిబిఐ కోరిక మేరకు బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆమె ఈ ఏడాది జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి ఆమె పలు మార్లు కింది నుంచి పైదాకా కోర్టుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు తోసివేతకు గురవుతూ వచ్చాయి.
ఇదిలావుంటే, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ను కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించింది. రేపు మంగళవారం నుంచి 16వ తేదీ వరకు సిబిఐ అధికారులు అలీఖాన్ను విచారిస్తారు. కాగా, ఎఎంసి కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూర్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు సిబిఐని ఆదేశించింది.